ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి అనిత ఒక కీలక ప్రెస్ మీట్లో తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. ఇటీవల పాయకరావుపేటలోని బీసీ బాలికల హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అనిత, అక్కడ కనిపించిన ఒక చిన్న తల వెంట్రుకను బొద్దింకగా మలచి వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని ఆమె ఆరోపించారు.

“నేను తినిన భోజనంలో బొద్దింక ఉందంటూ ప్రచారం చేయడం సరికాదు. నిజానికి అది బొద్దింక కాదు.. అది చిన్న తల వెంట్రుక,” అని అనిత స్పష్టం చేశారు. ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ, వైసీపీ అధికారిక సోషల్ మీడియా పేజ్ ద్వారా అసత్య ప్రచారాన్ని ప్రోత్సహించడాన్ని ఖండించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
“హాస్టల్ మెనూను పాటించకపోవడం, వార్డెన్ అందుబాటులో లేకపోవడం, సెక్యూరిటీ గార్డ్ లేకపోవడం వంటి అంశాలు కనిపించడంతో చర్యలు తీసుకున్నాం. వార్డెన్ను సస్పెండ్ చేశాం. అధికారులను రాష్ట్రవ్యాప్తంగా హాస్టల్స్పై తనిఖీలు జరపాలని ఆదేశించాం. కానీ నేను నిష్కల్మషంగా తీసుకున్న చర్యల్ని కూడా తప్పుడు ప్రచారానికి వాడుతున్నారు.”
అంతేగాక, ఇటీవల శ్రీశైలంలో ప్రసాదంలో బొద్దింక అంటూ వదంతులు ప్రచారమవుతున్నాయన్న విషయాన్ని ప్రస్తావించిన అనిత, ఇది “కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి వైసీపీ చేస్తున్న యత్నం” అని తీవ్రంగా మండిపడ్డారు. “జగన్కు ఒక్కటే ఆలోచన.. మరోసారి అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలి. ప్రజలకు మేలు చేయాలనే ప్రయత్నం చేస్తే కూడా తప్పుడు కోణాల్లో చూపించాలనుకుంటున్నారు” అంటూ వ్యాఖ్యానించారు.
ఈ సందర్బంగా “మా ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా ‘తొలి అడుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది పూర్తిగా ప్రజల పట్ల మేం చిత్తశుద్ధితో పని చేస్తున్న నిర్దేశం. కానీ వైసీపీ మాకు మానవత్వం లేదన్నట్లు చూపించడమే వారి లక్ష్యంగా మారింది,” అని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతిమంగా అనిత వ్యాఖ్యల వల్ల ఒక విషయమైతే స్పష్టమవుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం సోషల్ మీడియా వేదికగా జరగుతున్న తప్పుడు ప్రచారాలపై ఆమె ధీర్యంగా స్పందిస్తూ వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే నడతతో ముందడుగు వేసినట్లు అనిపిస్తోంది.


































