YS Jagan : కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. “రేపు మా ప్రతాపం ఏంటో చూపిస్తాం” అంటూ హెచ్చరించారు. 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు చేయని వ్యాఖ్యలకు అరెస్టు చేయడం దారుణమని, ఇది కక్ష సాధింపు చర్యేనని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలతో చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారని మండిపడ్డారు.

“ఒక చర్చ జరుగుతున్నప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్కు సంబంధం ఏంటి?” అని జగన్ ప్రశ్నించారు. చర్చల్లో కొందరు అనుకూలంగా, కొందరు వ్యతిరేకంగా మాట్లాడటం సహజం కదా అన్నారు. గతంలో చాలా టీవీ ఛానెళ్లలో అతిథులు వ్యక్తిత్వాలను కించపరిచేలా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని, ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉందని ఆయన గుర్తు చేశారు.
చంద్రబాబు ప్రభుత్వం ప్రజల తరఫున మీడియా నిలబడకూడదని, ఆయన చేస్తున్న తప్పులను ప్రశ్నించకూడదని కుట్ర చేస్తోందని జగన్ ఆరోపించారు. లేనిపోని ఆరోపణలు చేస్తూ, ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని, సాక్షి మీడియాపై కూడా దాడులు చేయిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. “చెడు సంప్రదాయాలకు నాంది పలుకుతూ, ఈరోజు ఏమి విత్తుతారో రేపు అదే అనుభవిస్తారు. అది కూడా రెండింతలు అవుతుంది” అని జగన్ హెచ్చరించారు.

































