కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చింది. గోవధ నివారణ, సంరక్షణ చట్టం ఈరోజు నుంచి కర్ణాటక రాష్ట్రంలో అమలులోకి వచ్చింది. కొత్త చట్టం అమలులోకి రావడం వల్ల కర్ణాటక రాష్ట్రంలో ఇకపై ఎవరైనా ఆవును చంపితే జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. గతేడాది డిసెంబర్ నెలలో కర్ణాటక రాష్ట్రంలో ఈ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించారు. స్లాటర్ ప్రొటెక్షన్ అండ్ పశువుల సంరక్షణ బిల్లు -2020 పేరుతో ఈ చట్టం అమలులోకి వచ్చింది.

కొత్త చట్టం ప్రకారం 13 సంవత్సరాల లోపు ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నలను చంపడానికి వీలు లేదు. 13 సంవత్సారాల పై బడిన ఆవులు, గేదెలు, ఎద్దులు, దున్నలను చంపే అవకాశం ఉన్నా పశు వైద్యులు అనారోగ్యం పాలైతే లేదా పరిశోధనల కొరకు అవసరమైతే మాత్రమే వాటిని చంపడానికి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాలు, దేశాలకు పశువులను తరలించడాన్ని కూడా ఈ చట్టం కింద నేరంగానే పరిగణిస్తారు.
ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం జరిమానా చెల్లించడంతో పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఎవరైతే గోవధకు పాల్పడతారో వారికి 50,000 రూపాయల నుంచి 5,00,000 రూపాయల వరకు జరిమానా విధించడంతో పాటు మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలోని సంతల్లో సైతం వధించడానికి పశువులను అమ్మడానికి వీలు లేదు.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ చట్టం అమలులో ఉండగా కర్ణాటక రాష్ట్రం కూడా ఈ చట్టం అమలు దిశగా అడుగులు వేయడం గమనార్హం. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇప్పటికే జంతువులపై క్రూరత్వ నియంత్రణ చట్టంలో భాగంగా కొన్ని నిబంధనలను అమలు చేస్తోంది.































