కరోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీ పై తీవ్ర ప్రభావం చూపింది.ఇప్పటికే ఎన్నో సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోలేక పోయాయి. అదే విధంగా మరి కొన్ని చిత్రాలు షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న పలు సినిమాలు థియేటర్లు మూత పడటంతో ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీ ప్లాట్ఫామ్ వేదికైన ఆహాలో త్వరలో పలు సినిమాలు విడుదల కాబోతున్నాయని ప్రకటించారు.

ఆహా వేదికగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా త్వరలోనే ఆహాలో విడుదల కాబోతున్నట్లు ఆహా నిర్వాహకులు ప్రకటించారు.ఈ సినిమాతో పాటు అక్కినేని మరో వారసుడు అఖిల్ పూజా హెగ్డే జంటగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా ఆహా లోనే విడుదల కాబోతుంది.
నాగ శౌర్య హీరోగా నటించిన లక్ష్య సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కూడా థియేటర్లో కాకుండా నేరుగా ఆహా వేదికపై విడుదల కానుంది. ఇక అమలాపాల్ ప్రధానపాత్రలో నటించిన కుడి ఎడమైతే చిత్రం త్వరలోనే ఆహాలో విడుదల కానుంది. అయితే ఈ సినిమాలన్ని ఎప్పుడు విడుదల అవుతాయో ఆహా త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.


































