మన దేశంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ విక్రయాలు క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్యాకేజింగ్ చేసి విక్రయించే డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ లో కాల్షియం, మెగ్నీషియం తప్పనిసరి అని కేంద్రం వెల్లడించింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి.

ప్రముఖ కంపెనీలు మంచినీటిని శుద్ధి చేసే ప్రక్రియలో భాగంగా శరీరానికి అవసరమైన ఖనిజాలను మంచినీటి నుంచి తొలగిస్తున్నాయి. ఈ విషయం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి వచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నీటిలో అవసరమైన ఖనిజాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ను కోరగా ఎఫ్ఎస్ఎస్ఎఐ కేంద్రం అనుమతితో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఎఫ్ఎస్ఎస్ఎఐ ప్రముఖ కంపెనీలకు ఈ నెల 31వ తేదీలోగా కాల్షియం, మెగ్నీషియం ఇతర ముఖ్యమైన ఖనిజ లవణాలు మంచినీటిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని గడువును ఇచ్చింది. లీటర్ మంచినీటిలో 20 మిల్లీగ్రాముల కాల్షియం, 10 మిల్లీగ్రాముల మెగ్నీషియం తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటికే పలు ప్రముఖ బ్రాండ్లు నూతన నిబంధనలను అనుగుణంగా డ్రింకింగ్ వాటర్ ను మార్కెట్ లో విడుదల చేస్తామని వెల్లడించాయి.
కిన్లే సంస్థ ఇప్పటికే క్యాల్షియం, మెగ్నీషియంలతో కూడిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఎఫ్ఎస్ఎస్ఎఐ కొత్త నిబంధనల వల్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తాగే వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.
































