దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు గ్యాస్ సిలిండర్ ను వినియోగిస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే గత కొన్నిరోజులుగా గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 40 రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 120 రూపాయలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 700 రూపాయలకు అటూఇటుగా ఉంది.

అయితే దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు గ్యాస్ సిలిండర్ డెలివరీ బ్యాస్ కు బిల్లులో పేర్కొన్న మొత్తం కంటే 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఎక్కువ మొత్తం చెల్లిస్తుంటారు. అయితే హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. బిల్లుల్లో పేర్కొన్న మొత్తం కంటే అదనంగా డబ్బులను డెలివరీ బాయ్స్ కు గ్యాస్ సిలిండర్ వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదని హెచ్.పీ.సీ.ఎల్ స్పష్టం చేసింది.
హెచ్పీసీఎల్ తమ కంపెనీ గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్లు సిలిండర్ ను బుక్ చేసుకున్న వారి ఇంటికి సిలిండర్ డెలివరీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. బిల్లులో పేర్కొన్న మొత్తం మాత్రం చెల్లిస్తే చాలని.. అదనంగా ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని గ్యాస్ కంపెనీ పేర్కొంది. హెచ్పీసీఎల్ ఆర్టీఐ రిప్లేలో గ్యాస్ సిలిండర్ కు సంబంధించి ఈ విషయాన్ని వెల్లడించింది.
గ్యాస్ సిలిండర్ వినియోగదారులు సైతం డెలివరీ బాయ్స్ కు బిల్లులో పేర్కొన్న మొత్తం కంటే ఎక్కువ మొత్తం చెల్లించకుండా నియమ నిబంధనల గురించి అవగాహన ఏర్పరచుకుంటే మంచిది. మరోవైపు ఆయిల్ కంపెనీలు గతంలో నెలకు ఒకసారి గ్యాస్ సిలిండర్ రేట్లను సవరించగా ప్రస్తుతం వారానికి ఒకసారి గ్యాస్ సిలిండర్ రేట్లను సవరిస్తూ ఉండటం గమనార్హం.






























