కరోనా మహమ్మారి విజృంభణ తరువాత దేశంలో చాలామంది సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి హోం లోన్ లను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకులు తక్కువ వడ్డీకే హోం లోన్ లను మంజూరు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. అయితే హోం లోన్ తీసుకోవాలని అనుకునే వారికి రియల్టీ సంస్థ పిరమాల్ రియల్టీ అదిరిపోయే ఆఫర్ ను తెచ్చింది.

సున్నా వడ్డీకే పిరమాల్ రియల్టీ సంస్థ హోం లోన్ లను ఇస్తోంది. ఫలితంగా లోన్ తీసుకుని కొత్తగా ఇల్లు కొనుగోలు చేసేవారికి ఎటువంటి అదనపు భారం పడదు. గతంలో ఏ రియల్టీ సంస్థ నుంచి ఇటువంటి స్కీమ్ కస్టమర్లకు అందుబాటులోకి రాలేదు. అయితే పిరమాల్ రియల్టీ సంస్థ ఎంపిక చేసిన ప్రాజెక్టులకు మాత్రమే ఈ ఆఫర్ ను ఇస్తుండటం గమనార్హం. పిరమాల్ సంస్థ ప్రీమియం ప్రాజెక్టులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
కరోనా మహమ్మరి విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల దేశంలో గడిచిన కొన్ని నెలల నుంచి కొత్త ఇళ్ల కొనుగోళ్లు భారీగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. అమ్మకాలు తగ్గిపోవడం వల్ల రియల్టీ సంస్థలు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. దీంతో రియాల్టీ సంస్థలు కస్టమర్ల కోసం ఇలాంటి కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ రియల్టీ కంపెనీ నుంచి లోన్ తీసుకున్న వారికి 2022 సంవత్సరం మార్చి వరకు వడ్డీ భారం పడదు.
ఆసక్తి ఉన్నవారు ముందుగానే బుకింగ్ చేసుకునే అవకాశాన్ని సైతం ఈ సంస్థ కల్పిస్తూ ఉండటం గమనార్హం. అయితే ఈ సంస్థకు చెందిన ప్రాజెక్టులలో మాత్రమే కొనుగోలు చేసేవారికి ఈ స్కీమ్ వల్ల ప్రయోజనం చేకూరనుండటంతో సామాన్య కస్టమర్లకు ఈ స్కీమ్ వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరదనే చెప్పాలి.
































