Senior journalist Bhardwaja : అక్కినేని నాగేశ్వరరావు గారు నాటక రంగం నుండి సినిమాల్లోకి వచ్చిన వ్యక్తి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతకాలానికే అగ్ర నటుడుగా ఎదిగారు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఇద్దరూ తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్ళలాగా ఉన్నారు. నాగేశ్వరావు గారి నటన ఆయనకు ఎంతో మంది అభిమానులను సంపాదించిపెట్టింది. అలాంటి అక్కినేని గారి గురించి పాటల రచయిత కవి అత్రేయ గారు తన వ్యాసంలో అక్కినేని గారికి నటన రాదు అంటూ విమర్శించారు. ఇక ఈ విషయాల గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు అప్పటి విషయాలను పంచుకున్నారు.

నటన రాదు.. పొట్టి వాడు…
అక్కినేని ని ఆయన వ్యాసంలో విమర్శిస్తూ గంభీరమైన గొంతు లేదు, పొట్టి వాడు, నాటక రంగం వదిలేయడం వల్ల ఇంతకంటే ఇంకా నటన చేయలేడు. మరో ఇరవై ఐదేళ్ళు బండి లాగిస్తాడు కానీ అందులో విభిన్నత ఉండదు. నాటక రంగం నుండి వచ్చిన నాగేశ్వరావుకి లోపాలు తెలుసు వాటిని సరిదిద్దుకున్నాడు కానీ ఇప్పుడు సినిమాలను చేస్తూ నాటకరంగం వదిలేయడం వల్ల నటనలో వైవిద్యం లేదు, అదే మూస హావభావాలను పలికిస్తున్నారు అంటూ విమర్శిస్తూ ఇలా మాట్లాడినందుకు నాగేశ్వరావు గారి భార్య అన్నపూర్ణ గారికి క్షమాపణలు కూడా చెప్పారట ఆ వ్యాసంలో. ఇక ఈ వ్యాసం గురించి అక్కినేని గారు కూడా ఎటువంటి వ్యతిరేకత వ్యక్తపరచకుండా చాలా హుందగా తీసుకున్నారట. ఈ విషయాలను భరద్వాజ గారు చెబుతూ కాంతారా వంటి సినిమాలను ఇప్పుడు ఆదరిస్తారనే విషయం అప్పట్లోనే అత్రేయ గారు వివరించారు అంటూ చెప్పారు.

నాటకరంగం వారికి జనాలకు ఏం కావాలో ప్రత్యక్షంగా తెలుసుకుంటారు దానికి అనుగుణంగా వారి నటన అభివృద్ధి చేసుకుంటారు. జనాల ముందు నటించేవారికి కెమెరా ముందు నటించే వారికి తేడా ఉంటుంది. అలాంటి నాటక రంగాన్ని చంపేసి సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తున్నవారు భవిష్యత్ లో మూల్యం చెల్లించుకుంటారు అంటూ అప్పుడే హెచ్చరించారట ఆత్రేయ. బాహుబలి లాంటి గ్రాఫిక్స్ వండర్ చూసినా జనాలకు కాంతార ఒక కొత్త అనుభూతి అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. యక్షగానం లాంటి నాటక రంగం కళ నుండి వచ్చిన రిషబ్ శెట్టి నటన సినిమాలో ప్రేక్షకులను కట్టిపడేసింది అందుకే భాష ప్రమేయం లేకుండా సినిమా హిట్ అయింది అంటూ చెప్పారు.


































