హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి పండుగ రోజున పిల్లల నుంచి పెద్దల వరకు బాణసంచా కాల్చి గ్రాండ్ గా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల ఈ సంవత్సరం పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గతంలో శివకాశి పేరు వినిపిస్తే బాణసంచా హబ్ అని చెప్పేవాళ్లు. కానీ అక్కడ ప్రస్తుతం దీపావళి పండుగ జోష్ అస్సలు కనిపించడం లేదు.

శివకాశిలోని ప్రతి కుటుంబానికి బాణసంచాతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉంది. అనేక రాష్ట్రాలు బాణసంచాపై బ్యాన్ విధించిన నేపథ్యంలో శివకాశి కళ కోల్పోయింది. దీపావళి పండుగ సమయంలో అమ్మే బాణసంచాపై ఆధారపడి అక్కడి కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. పురుషులు, మహిళలు అనే తేడాల్లేకుండా అందరూ బాణసంచా పరిశ్రమల్లో పని చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు.
బాణసంచా తయారీ పరిశ్రమలో పని చేయడం వల్ల కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో పాటు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలే కోల్పోయే అవకాశం ఉంది. బాణసంచా అమ్మకాలు ఆగిపోతే తన జీవితాలు తలక్రిందులు అవుతాయని.. ఉపాధి కోల్పోతే బ్రతికే పరిస్థితి లేదని బాణసంచా తయారీదారులు చెబుతున్నారు. నిషేధం విధించి మా పొట్ట కొట్టొద్దు సార్లూ అని వేడుకుంటున్నారు.
ఇప్పటికే కరోనా వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని గతంతో పోలిస్తే 45 శాతం వరకు బాణసంచా ఉత్పత్తి తగ్గిందని ఇలాంటి సమయంలో నిషేధం విధించడం ద్వారా తాము మరింత నష్టపోతామని బాణసంచా విక్రయదారులు రోదిస్తూ ఉండటం గమనార్హం.































