10th Class Exams: గత రెండేళ్ల నుంచి కోవిడ్ కారణంగా చదువులు అటకెక్కాయి. కేవలం ఆన్ లైన్ చదువులతోనే విద్యార్థులు కాలం వెళ్లదీశారు. వరసగా కరోనా వేవ్ లు, లాక్ డౌన్లతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా విద్యార్థుల విద్యా సంవత్సారాలను కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం థర్డ్ వేవ్ కారణంగా మూతపడిన స్కూళ్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి.

అయితే ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. ఇందుకు సంబంధించి ఎప్రిల్ చివర్లో కానీ మేలో కానీ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసే కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఎస్ఎస్సీ బోర్డ్ కసరత్తును ప్రారంభించింది. కరోనా కారణంగా 2021-22 విద్యా సంవత్సరాన్ని చాలా ఆలస్యంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

జూన్ 12 నుంచే తరగతులు ప్రారంభం కావాల్సి ఉన్నా…అక్టోబర్ వరకు తరగతులు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో విద్యా శాఖ అకాడమిక్ ఇయర్ కు సంబంధించిన క్యాలెండర్ ను సవరించింది. అకడమిక్ ఇయర్ ఎప్రిల్ 30 వరకు కొనసాగించేలా క్యాలెండర్ ని సవరించింది. ఈ సమయంలోనే సిలబస పూర్తయ్యేలా కొన్ని పాఠ్యాంశాలను కూడా తగ్గించింది. పదో తరగతి సిలబస్ ను మార్చి 31 కల్లా పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించింది.
టెన్త్ పరీక్షల కోసం ఫీజు గడువును ..
దీంతో పదో తరగతి విద్యార్థలు పరీక్షలకు సన్నద్ధం అయ్యేలా రివిజన్ చేయించనున్నారు. ఫ్రీ ఫైనల్ నిర్వహించిన తర్వాత.. ఏప్రిల్ ఆఖరు లేదా మే నెల తొలివారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. మరోపక్క ఇంటర్మీడియట్ పరీక్షలు ఎప్రిల్ నెలలో జరుగనున్నాయి. వీటి నిర్వహణ అనంతరం టెన్త్ పరీక్షలు జరుగనున్నాయి. ఇదిలా ఉండగా.. టెన్త్ పరీక్షల కోసం ఫీజు గడువును మరోసారి పొడగించింది ఎస్సెస్సీ బోర్డ్. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి. దేవానంద్ రెడ్డి మంగళ వారం ప్రకటన జారీ చేశారు. ఫిబ్రవరి 5 వరకు ఇదివరకు తుది గడువుగా నిర్ణయించగా.. తాజాగా దాన్ని ఫిబ్రవరి 11వ తేదీ వరకు పొడిగించారు.

































