దేశంలో టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నా కొందరి ఆలోచనా తీరులో మాత్రం మార్పు రావడం లేదు. దేశంలో నేటికీ లక్షల సంఖ్యలో ప్రజలు మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. శాస్త్రవేత్తలు అరచేతిలో అద్భుతాలను సృష్టిస్తోంటే కొందరు మాత్రం నరబలులు, జంతుబలులు చేస్తూ అమాయక ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు. తాజాగా జార్ఖండ్ లో చోటు చేసుకున్న దారుణ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది.

కొడుకు పుట్టాలంటే కూతురును బలి ఇవ్వాలని క్షుద్రపూజలు చేసే వ్యక్తి చెప్పగా ఆ వ్యక్తి మాటలను నమ్మి కన్నతండ్రే కూతురును దారుణంగా చంపేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీకి సమీపంలో సమన్ నెగాసియా అనే 26 సంవత్సరాల వ్యక్తి కూలిపని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం అతనికి వివాహం కాగా సమన్ దంపతులకు ఒక కూతురు ఉంది. అయితే సమన్ కు మాత్రం కొడుకు పుడితే బాగుంటుందనే కోరిక బలంగా ఉండేది.
కొడుకు కోసం సమన్ బాబాలను, క్షుద్రపూజలు చేసేవాళ్లను తరచూ కలుస్తూ ఉండేవాడు. అతని కోరిక విన్న ఒక మాంత్రికుడు కూతురును బలి ఇస్తే తప్పకుండా కొడుకు పుడతాడని చెప్పాడు. దీంతో సమన్ తన ఆరేళ్ల కూతురును బలి ఇచ్చాడు. అయితే కూతురు కనిపించకపోవడంతో కంగారు పడిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని సమన్ ను అరెస్ట్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు కూతురును బలివ్వాలని సమన్ కు చెప్పిన క్షుద్రపూజలు చేసే వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

































