విశ్వాసానికి మారు పేరు శనకాలు అని మనం వింటూ ఉంటాం. మనం వాటిని దగ్గరకు తీసుకొని ఆత్మీయతను పంచితే అవి మనం చనిపోయే వరకు కూడా చేసిన సాయాన్ని మర్చిపోవట. అంత విశ్వాసంగా ఉంటాయట శునకాలు. అంత విశ్వాసంగా ఉంటాయి కాబట్టే.. ఇక్కడ తన యజమాని ప్రాణాలు కాపాడేందుకు వాటి ప్రాణాలను సైతం అడ్డు పెట్టాయి.

అసలు విషయం ఏంటంటే.. రెండు కుక్కలు తమ ఓనర్ ప్రాణాలను కాపాడేందుకు విషపూరితమైన పాముతో తలపడ్డాయి. అతడి ప్రాణాలు కాపాడే తరుణంలో అవి ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఈ ఘటన విన్న ప్రతీ ఒక్కరూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. రాజన్ అనే వ్యక్తి భడోహిలోని జైరాంపూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. అతడు రెండు కుక్కలను పెంచుకుంటున్నాడు. రాత్రి ఓ నల్లటి విష సర్పం వాళ్ల ఇంట్లోకి చొరబడింది.
దానిని పసిగట్టిన కుక్కలు అరవడం మొదలు పెట్టాయి. ఇంట్లోకి వెళ్తుండగా రెండు కుక్కలు దానిపై దాడి చేశాయి. ఇంట్లోకి ప్రవేశించకుండా దాదాపు రెండు గంటల సేపు పోరాడాయి. చివరకు ఆ పాము రెండు ముక్కలు చేసి చంపేశాయి. అయితే ఈ దాడిని చూసిన స్థానికులు హడలిపోయారు. ఆ పాము నుంచి రెండు కుక్కలను కాపాడేందుకు వాళ్లు ప్రయత్నించారు. కానీ అవి పామును చంపేంత వరకు వదిలిపెట్టలేదు. ఆ పాము కుక్కలను చాలాచోట్ల కాటు వేసింది.
పామును చంపిన కొద్ది నిమిషాల తర్వాత శునకాలు కూడా చనిపోయాయి. విషయం తెలుసుకున్న యజమాని తల్లి తల్లడిల్లిపోయింది. ఈ నిజాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని రాజన్ మీడియాతో చెప్పాడు. అయితే వాటికి దహన సంస్కారాలు చేసిన యజమాని.. వాటి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.






























