దేశంలో రోజురోజుకు సంతానం లేక గుళ్లు, ఆస్పత్రుల చుట్టూ తిరిగే వారి సంఖ్య పెరుగుతోంది. పెళ్లై చాలా సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టకపోవడంతో చాలామంది దంపతులు పిల్లలు పుట్టడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒక గ్రామ ప్రజలు మాత్రం తమ గ్రామంలో నీళ్లు తాగితే పిల్లలు ఖచ్చితంగా పుడతారని చెబుతున్నారు. ఏకంగా కవల పిల్లలు పుట్టారని తమ గ్రామంలో అందరికీ కవల పిల్లలే ఉన్నారని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు.

తమ గ్రామంలోని బావిలో ఉండే నీళ్లు మహిమ ఉన్న నీళ్లని అందువల్లే పిల్లలు లేని వాళ్లు తమ గ్రామంలోని బావి నీళ్లు తాగితే పిల్లలు పుడతారని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. శాస్త్రపరంగా ఆ గ్రామంలోని నీళ్లు తాగితే కవల పిల్లలు పుడతారని ఎలాంటి ఆధారాలు లేకపోయినా ప్రజలు మాత్రం బలంగా నమ్ముతున్నారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఆ గ్రామంలో నీళ్లు తాగితే కేర్ కేర్ మంటూ నీళ్లు తాగిన కొన్ని నెలల తర్వాత పుడతారని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు.
ఇది మూఢ నమ్మకం కొందరు చెప్పినా అక్కడి గ్రామస్తులు ఆధారాలు చూపిస్తూ ఉండటం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో ఈ బావి ఉంది. గత కొన్నేళ్లుగా కవలలు పుడుతున్న గ్రామంగా పేరు తెచ్చుకున్న ఈ గ్రామం గురించి, గ్రామంలోని బావి గురించి నెట్టింట వైరల్ అవుతోంది. బావి ఊరికి కొంత దూరంలో ఉన్నా ఇక్కడి ప్రజలు మాత్రం ఈ బావి నీళ్లు తాగడానికి ఇష్టపడతారు.
ఆ గ్రామంలో ఏ ఇంటికి వెళ్లినా కవల పిల్లలే దర్శనమిస్తారు. ఆ గ్రామంలోని బావి నీళ్లు కూడా ఎంతో రుచిగా ఉంటాయని గ్రామస్తులు చెబుతున్నారు. బావి గురించి జోరుగా ప్రచారం జరగడంతో ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి బావినీళ్లను తాగుతూ ఉండటం గమనార్హం.































