అంతకముందు ఎప్పుడూ లేనంతగా గత కొన్ని నెలల నుంచి నిత్యావసర వస్తువులతో పాటు ఇంధన ధరలు పెరుగుతూ ఉండటంతో సామాన్యుల చేతికి చమురు వదులుతోంది. కరోనా కష్టకాలంలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కరోనా మొదటి వేవ్ లో మూడు సిలిండర్లను ఉచితంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆ మూడు సిలిండర్లు కూడా ఉజ్వలపథకం ఉన్నవారికి మాత్రమే ఇచ్చారు. మిగతా వారికి గ్యాస్ భారం తప్పలేదు. ఇలా ప్రతీ నెలా గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు.
ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో రూ.940 కి పైగా గ్యాస్ సిలిండర్ ధరలు ఉన్నాయి. ఇక రాబోయే రోజుల్లో వినియోగదారులు ఎల్పీజీ సిలిండర్ కోసం వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ కూడా నిలిపివేసే అవకాశం కూడా ఉంది. గ్యాస్ ధరలు పెంచే ఆలోచన గురించి అధికారికంగా బయటకు రాలేదు కానీ.. పెట్రోల్, డీజిల్ పెంచినట్లుగానే గ్యాస్ కూడా పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే ఉజ్వల పథకం ద్వారా సిలిండర్ లు పొందిన వారికి మాత్రం సబ్సిడీ ఇవ్వాలనే ఆలోచనలో కూడా కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వార్షిక ఆదాయం రూ.10 లక్షలకు మించితే గ్యాస్ సబ్సిడీ వచ్చే అవకాశం ఉండదు. ఇకపోతే గడిచిన 18 నెలల్లో గ్యాస్ సిలిండర్ ధర రెండింతలు పెరిగింది.
































