Vijay Devarakonda: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి నటుడు విజయ్ దేవరకొండ త్వరలోనే ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన అవార్డును వేలం వేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఈయన నటనకు గాను ఏకంగా ఫిలింఫేర్ అవార్డులలో ఉత్తమ నటుడిగా అవార్డు వరించింది. అయితే ఈ అవార్డును ఈయన 2018 వ సంవత్సరంలో అమ్మేశారట. తనకు అవార్డులంటే పెద్దగా ఇష్టం ఉండదని విజయ్ దేవరకొండ పలు సందర్భాలలో వెల్లడించారు.
ఇలా తనకొచ్చిన కొన్ని అవార్డులను అమ్మగా మరికొన్ని ఆఫీసులో ఉన్నాయని మరికొన్ని ఇంట్లో ఉన్నాయని తెలిపారు. అయితే అర్జున్ రెడ్డి సినిమాకు వచ్చినటువంటి ఈ అవార్డును తాను వేలం పాటలో పెట్టానని ఒక ఐదు లక్షలకు అమ్ముడు పోతే పర్లేదు అనుకున్నాను కానీ ఈ అవార్డును ఏకంగా 25 లక్షలకు కొనుగోలు చేశారని ఈయన తెలిపారు.
25 లక్షలు..
ఈ అవార్డు వేలం వేసిన సమయంలో దివి ల్యాబ్స్ కుటుంబానికి చెందినటువంటి శ్యామలాదేవి అనే మహిళ 25 లక్షలకు ఈ అవార్డు కొనుగోలు చేశారు. ఈ స్థాయిలో ఈ అవార్డు వేలంపాటలో పోవడంతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించి ఆమెకు అవార్డును అందజేశామని తెలిపారు. అయితే ఈ అవార్డు వేలం పాటలో వచ్చిన 25 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపించానని విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
































