ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలో సరుకులను రవాణా చేసేవాళ్లకు శుభవార్త చెప్పింది. రవాణా ఛార్జీలను గతంతో పోల్చి చూస్తే భారీగా తగ్గించింది. ఏపీఎస్ఆర్టీసీ రవాణా ఛార్జీలను తగ్గించడం ద్వారా సరుకు రవాణా విస్తరణను మరింత పెంచవచ్చని భావిస్తోంది. 100 కిలోమీటర్ల లోపు దూరానికి ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీలను దాదాపు 50 శాతం తగ్గించడం గమనార్హం. ఏపీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం ద్వారా రైతులకు, చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చాలని భావిస్తోంది.
రవాణా ఛార్జీలు భారీగా తగ్గించడం ద్వారా సరుకు రవాణా చేసేవాళ్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. టన్నుకు 100 కిలోమీటర్ల లోపు వెయ్యి రూపాయలు, 500 కిలోలకు 100 కిలోమీటర్ల లోపు 500 రూపాయలు వసూలు చేస్తామని ఏపీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. కనీస లోడు మూడు టన్నులు ఉంటే ఆ లోడ్ కోసం ప్రత్యేక వాహనాన్ని కేటాయిస్తామని ఏపీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. రవాణా చేసే సరుకులకు టోల్ ఛార్జీలు, జీఎస్టీ ఛార్జీలు ఉండవని ఆర్టీసీ పేర్కొంది.
ఆర్టీసీ కార్గో సర్వీస్ లో సరుకులను రవాణా చేసే ఏజెంట్లు బుక్ చేసుకుని సరుకు రవాణా చేయవచ్చని ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది. ఎవరైతే ఆర్టీసీ కార్గో ద్వారా బుక్ చేస్తారో వారికి నికర ఛార్జీపై ఏకంగా 5 శాతం తగ్గింపు ఉంటుందని ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసీ డిపోలు, సరకు రవాణా కౌంటర్లలో సంప్రదించి బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఛార్జీలను తగ్గించడం ద్వారా సరుకులను రవాణా చేసేవాళ్లకు ప్రయోజనం చేకూరనుంది.
ఏపీఎస్ఆర్టీసీ సరుకు రవాణా ద్వారా ఆదాయం పెంచుకోవాలని భావిస్తోంది. అయితే సరుకురవాణా ఛార్జీలను ఎక్కువగా ఉండటంతో చాలామంది ఆర్టీసీ ద్వారా సరుకు రవాణాకు ఆసక్తి చూపలేదు. దీంతో ఏపీఎస్ఆర్టీసీ ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది.