కరోనా సంక్షోభ సమయంలో ఆదాయం తగ్గడం వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీలన్నీ లాక్ డౌన్ సమయంలో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడంతో పాటు 20 శాతం నుంచి 30 శాతం వరకు వేతనాల్లో కోత విధించాయి. ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండగా గ్యాస్ కంపెనీలు మాత్రం రాయితీ సిలిండర్ ధరలను అంతకంతకూ పెంచుతున్నాయి.

ఈ నెల 2వ తేదీన గ్యాస్ కంపెనీలు సిలిండర్ ధరలను ఏకంగా 50 రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే. 15 రోజులు కూడా గడవక ముందే గ్యాస్ కంపెనీలు మళ్లీ ధరలను పెంచడం గమనార్హం. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 700 రూపాయలకు అటూఇటుగా గ్యాస్ సిలిండర్ లభిస్తుండగా సిలిండర్ ధర 750 రూపాయలకు పెరిగే అవకాశం ఉంది. అయితే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినా ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
గ్యాస్ కంపెనీలు కేవలం సబ్సిడీ గ్యాస్ సిలిండర్లపై మాత్రమే ధరలను పెంచాయి. అందువల్ల ఆ మొత్తం సబ్సిడీ ఖాతాదారుల అకౌంట్లలో జమవుతుంది. అందువల్ల ధరలు పెరిగినా గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు లాభమే కానీ నష్టం ఉండదు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 12 గ్యాస్ సిలిండర్లను వినియోగదారులకు సబ్సిడీ రూపంలో ఇస్తోంది. ఫలితంగా ధరలు ఎంత పెరిగినా గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఎటువంటి నష్టం లేదు.
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రతి నెలా మొదటి వారంలో గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షించి ధరలలో మార్పులు చేస్తూ ఉంటాయి. అయితే ఈ నెలలో మాత్రం రెండు సార్లు ధరలలో మార్పులు చేయడంతో పాటు ఏకంగా 100 రూపాయలు పెంచాయి. అయితే కేంద్రం 12 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉండటం వల్ల గ్యాస్ సిలిండర్ వినియోగదారులు కంగారు పడాల్సిన అవసరం లేదు.































