దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ మెడికల్ షాపులు ఇష్టానుసారం ధరలు పెంచి మందులు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రైవేట్ మెడికల్ షాపుల ఆగడాలకు చెక్ పెట్టే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ జనరిక్ ఔషధాల దుకాణాలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ దుకాణాల ద్వారా తక్కువ ధరకే ప్రభుత్వం ‘తెలంగాణ బ్రాండ్’ జనరిక్ మందులను అందించనుంది.

‘తెలంగాణ ప్రభుత్వ సరఫరా’ అనే లేబుల్ ను అతికించి ఈ ఔషధాలను విక్రయిస్తారు. రాష్ట్రంలోని చాలా మందుల దుకాణాల్లో తక్కువ ధరకు లభించే మందులను సైతం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీంతో ఔషధాలను కొనుగోలు చేసే ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. హైదరాబాద్ నగరానికి ఇప్పటికే ఫార్మా క్యాపిటల్ గా పేరుంది. నగరంలో ఎన్నో ఫార్మా కంపెనీలు ఉన్నా ఆ కంపెనీలు ప్రభుత్వానికి ఔషధాలను విక్రయించడం లేదు.
వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు రాష్ట్రంలోని చాలా తక్కువ ఫార్మా కంపెనీలు మాత్రమే ప్రభుత్వానికి ఔషధాలను తక్కువ ధరకు ఇచ్చేందుకు సహకరిస్తున్నాయని తెలుపుతున్నారు. దీంతో తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని బ్రాండెడ్ ఫార్మా కంపెనీలతో భేటీ కావడంతో పాటు ఆ మందులను ప్రజలకు తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం విధించే కఠినమైన షరతుల వల్లే కొన్ని కంపెనీలు ప్రభుత్వానికి ఔషధాలను విక్రయించేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది.
ప్రభుత్వానికి మందులు సరఫరా చేస్తే ఏ చిన్న తప్పు జరిగినా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవకాశం ఉంది. కంపెనీలు సైతం బ్లాక్ లిస్ట్ లో పెడితే తమ వ్యాపారం దెబ్బ తింటుందని భావిస్తున్నాయి. దీంతో నిబంధనల్లో కొన్ని మార్పులుచేర్పులు చేసి బ్రాండెడ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.


































