దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి ని కట్టడి చేయాలంటే ఆయుర్వేద మందు ఒకటే మార్గమని, ఆయుర్వేద మందుల ద్వారా మనల్ని మనం రక్షించుకోవాలని కిస్కింద హనుమ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి స్వామిజీ స్పష్టం చేశారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య అందిస్తున్నటువంటి ఆయుర్వేద మందు వల్ల ఎంతోమంది ప్రాణాలు నిలబడ్డాయని స్వామీజీ పేర్కొన్నారు.

ఆనందయ్య కరోనా కట్టడి చేయడం కోసం తయారు చేసిన ఆయుర్వేద మందు ఆయుర్వేద గ్రంథాల ఆధారంగా తయారు చేశారని, ఈ మందులో ఎటువంటి లోపాలు లేవని, ఈ మందులలో ఎలాంటి సందేహం వ్యక్తం చేయకుండా ప్రజలందరికీ అందించవచ్చని ఈ సందర్భంగా గోవిందానంద సరస్వతి తెలిపారు.
ఆనందయ్య తయారుచేస్తున్న ఈ ఆయుర్వేద మందు వల్ల ప్రజలకు ఎలాంటి హానీ లేదని,ఈ ఆయుర్వేద మందు ప్రజలందరికీ అందే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన స్వామీజీకి వేద పండితులు ఘన స్వాగతం పలికారు.
స్వామివారి దర్శనం అనంతరం విలేకరులతో మాట్లాడిన గోవిందానంద సరస్వతి స్వామీజీ రాష్ట్ర ప్రజలందరూ ఈ మహమ్మారి బారిన పడకుండా సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించడం కోసమే తిరుమల వచ్చానని ఈ సందర్భంగా తెలియజేశారు.త్వరలోనే హనుమన్ జన్మస్ధలంపై చర్చకు వస్తామని స్వామీజీ తెలిపారు.