Hyderabad Traffic: హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే చెక్ పెట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచస్థాయి మహా నగరంగా భాగ్యనగరం రూపుదిద్దుకుంటున్న సమయంలో ట్రాఫిక్ సమస్యలను పూర్తిగా తీరేలా మార్పలు చేస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు.

ఇటీవల కాలంలో హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోంది. దీనికి తగ్గట్లుగానే వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్యలు తీరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

హైదరాబాద్ ట్రాఫిక్ జంక్షన్లలో భారీగా మార్పులు చేస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. పలు జంక్షన్ల వద్ద రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పాటు నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా సిగ్నల్ ఫ్రీ సిటీగా చేయాలని చర్యలు తీసుకుంటున్నారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మాదిరిగానే ..
ఈ క్రమంలోనే రద్దీ జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్ట్ లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. నగరంలో రద్దీగా ఉండే జూబ్లీ హిల్స్, లంగర్ హౌజ్, నానాల్ నగర్, రవీంద్రభారతి, కంట్రోల్ రూపం పాటు పలు జంక్షన్లలో మార్పలు చేయనున్నట్లు రంగనాథ్ తెలిపారు. మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కు వాహనాల్నింటిని నేరుగా పంజాగుట్టకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఫిలిం నగర్ నుంచి రోడ్ నెంబర్ 10 వైపు వెళ్లే వాహనాలన్నింటినీ.. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఫ్రీ లెఫ్ట్ ఇచ్చి మళ్లించనున్నారు. ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఈ విధానం సక్సెస్ అయింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మాదిరిగానే అన్నింటిని తయారు చేసే ఆలోచనలో ఉన్నారు. వాహనాలు జంక్షన్ల వద్ద నిలిచిపోకుండా చర్యలు తీసుకోనున్నట్లు రంగనాథ్ తెలిపారు. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ తో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామని ఆయన అన్నారు. వారం రోజుల్లో హైదరాబాద్ లోని రద్దీ జంక్షన్ల వద్ద ట్రయల్స్ నిర్వహించబోతున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు.































