టాలీవుడ్లో థియేటర్ లీజులు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, నిర్మాతలపై పెరుగుతున్న ఒత్తిళ్ల అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తాజాగా తెలుగుడెస్క్ కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సునీల్ నారంగ్ పేర్లు ప్రస్తావిస్తూ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

థియేటర్ వ్యవస్థ కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిపోతోందని నట్టి కుమార్ ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో ఎక్కువ థియేటర్లు కొందరి ఆధీనంలోనే ఉన్నాయని, నిర్మాతలు స్వేచ్ఛగా సినిమాలు విడుదల చేసుకునే పరిస్థితి లేకుండా పోతోందని అన్నారు. “ఎవడైనా నిర్మాత అవ్వొచ్చు కానీ, థియేటర్ వ్యవస్థ మాత్రం కొందరి చేతుల్లోనే ఉంది” అంటూ వ్యాఖ్యానించారు.
ఇటీవల విడుదలకు సిద్ధమవుతున్న “పెద్ది” సినిమా చుట్టూ జరుగుతున్న చర్చలపై కూడా ఆయన స్పందించారు. పెద్ద సినిమాలపై అధిక ఒత్తిళ్లు తీసుకురావడం, భారీ మొత్తాలు డిమాండ్ చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. “పెద్ది సినిమాపై ఐదు కోట్లు పడిపోవాలా? ఇది వ్యాపారమా లేక రౌడీ మామూలా?” అంటూ ప్రశ్నించారు. ఇంకా మాట్లాడుతూ, సినిమా డిస్ట్రిబ్యూషన్ వారి చేతిలో ఉంటే ఆ సినిమాపై వివాదాలు ఉండవని, అదే ఇతరులకు వెళ్తే సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. “పెద్ది సినిమాకి దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇలాంటి డిస్కషన్లు వచ్చేవి కావు” సునీల్ నారంగ్ కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేవారు అని వ్యాఖ్యానించారు.
మరోవైపు నిర్మాతలపై ఒత్తిడి పెరుగుతోందని నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్ రెంట్లు పెంచడం, పర్సెంటేజీలు పెంచడం వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. “100 రోజుల సినిమాలు ఇప్పుడు మూడు రోజుల్లోనే పడిపోవడానికి కారణం ఇదే” అని అభిప్రాయపడ్డారు.
ఇంటర్వ్యూలో ఆయన మరికొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. కొందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి ఇతరులను ఇండస్ట్రీలో నిలవనివ్వకుండా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమిళ సినిమాలు తమిళ నేటివిటీని, కేరళ సినిమాలు తమ సంస్కృతిని కాపాడుకుంటున్నాయని, కానీ తెలుగు సినిమా మాత్రం పాన్ ఇండియా పేరుతో తన మూలాలను కోల్పోతుందన్నారు. ఇక హీరోల పేర్లు లాగి లేనిపోని కాంట్రవర్సీస్ సృష్టిస్తున్నారని కూడా నట్టి కుమార్ వ్యాఖ్యానించారు. “డిస్ట్రిబ్యూషన్ రాలేదని చిరంజీవి, రామ్ చరణ్లను టార్గెట్ చేయడం ఎందుకు?” అంటూ ప్రశ్నించారు. హీరోలకు దీనితో సంబంధం లేకపోయినా, వారిని వివాదాల్లోకి లాగడం సరైంది కాదన్నారు.
అలాగే మైత్రి మూవీ మేకర్స్ ను కూడా టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. “మైత్రిని లేపేయాలన్నదే అసలు టార్గెట్?” అంటూ ప్రశ్నించారు. నిర్మాత నాగవంశీ తో పాటూ మరికొంత మంది నిర్మాతలు సినిమాలు ఇవ్వడం తగ్గించడంతోనే కొన్ని వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయన్న సంకేతాలు ఇచ్చారు. సినీ పరిశ్రమలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ పూర్తిగా మారిపోయిందని నట్టి కుమార్ అన్నారు. ఇప్పుడు నిర్మాతల కంటే హీరోలే ఎవరికివ్వాలో నిర్ణయించే పరిస్థితి వచ్చిందని, ఈ వ్యవస్థలో చిన్న నిర్మాతలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మొత్తానికి నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో కొత్త చర్చకు దారి తీశాయి. థియేటర్ వ్యవస్థ, డిస్ట్రిబ్యూషన్ రాజకీయాలు, నిర్మాతల సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమలోని ఇతర ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి.
ప్రొడ్యూసర్ నట్టికుమార్ EXCLUSIVE ఇంటర్వ్యూ! ఇక్కడ చూడవచ్చు..






























