ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో తీవ్రరూపం దాలుస్తున్న కరోనా రెండవ దశ వేరియంట్ ను గత ఏడాది అక్టోబర్ లోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ క్రమంలోనే భారత్ లో తొలిసారిగా గుర్తించిన రెండు వేరియంట్లపై ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పని చేస్తున్నట్లు అమెరికా పరిశోధకులు తెలియజేశారు.

ఎన్వైయూ గ్రూస్మెన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, ఎన్వైయూ లాంగోన్ సెంటర్ సంయుక్తంగా జరిపిన పరిశోధనలో భారత్ రకం వేరియంట్లపై ఈ ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు ఎంతో సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఈ టీకాల వల్ల వేరియంట్ లకు వ్యతిరేకంగా పోరాడే యాంటీ బాడీస్ బలహీన పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ పరిశోధనలో భాగంగా ఈ రెండు రకాల వ్యాక్సిన్లు తీసుకున్న వారి నుంచి రక్తనమూనాలను సేకరించి స్పైక్ ప్రాంతంలో వేరియంట్లను సూడోవైరస్ ఇంజినీరింగ్ ద్వార వేరు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ల్యాబ్ లో పెరిగిన కణాలపై యాంటీబాడీలు ఏ విధంగా పని చేస్తున్నాయని పరిశీలించగా B.1.617 వేరియంట్ను తటస్థీకరించే యాండీబాడీల పరిమాణంలో దాదాపు నాలుగు రెట్లు తగ్గినట్లు గుర్తించారు.
కొన్ని రకాల యాంటీబాడీలు ఈ వేరియంట్లపై పనిచేయకపోయినా.. మిగతా యాంటీబాడీలు మాత్రం వాటిని సమర్ధంగా అడ్డుకున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. దీనిని బట్టి చూస్తే ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయని నిపుణులు భావిస్తున్నారు

































