కడప జిల్లాలోని జమ్మలమడుగు సమీపంలో వెలసిన నారాపుర వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. పెన్నా నది తీరాన ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ ఆలయం ప్రత్యేక స్థల పురాణం, వైభవమైన బ్రహ్మోత్సవాలతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా భక్తుడి పేరుతో స్వామివారు వెలసిన క్షేత్రంగా ఈ దేవాలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

స్థానిక కథనాల ప్రకారం విజయనగర సామ్రాజ్య కాలంలో రాజు విజయ దేవరాజు ఇక్కడ విష్ణుమూర్తి ఆలయం నిర్మించాలని భావించినట్లు చెబుతారు. ఆయన భార్య నారాయణమ్మ పేరు ఆధారంగా ఈ ప్రాంతానికి తొలుత నారాయణపురం అనే పేరు వచ్చిందని, కాలక్రమేణా అది నారాపురంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.
ఇక ఆలయానికి సంబంధించిన మరో విశేషం భక్తుడు నారాపురయ్యతో ముడిపడి ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి కలలో దర్శనమిచ్చి తన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆదేశించాడని కథనం. స్వామి సూచించిన ప్రదేశంలో విగ్రహం లభించడంతో నారాపురయ్య దానిని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించాడని విశ్వసిస్తారు. అప్పటి నుంచి ఈ క్షేత్రం నారాపుర వేంకటేశ్వర స్వామి ఆలయంగా భక్తుల్లో ప్రసిద్ధి చెందింది.
ప్రతి ఏడాది వైశాఖ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు ఈ ఆలయానికి మరింత ఆధ్యాత్మిక శోభను తెస్తాయి. ఈ ఉత్సవాల్లో రోజుకో వాహన సేవ భక్తులను ఆకట్టుకుంటుంది. అయితే అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి కలిగించేది రథోత్సవమే. వేలాదిమంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవం జమ్మలమడుగు ప్రాంతంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
రథోత్సవానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. కుల, మత భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసి స్వామివారి రథాన్ని లాగడం ఇక్కడి సంప్రదాయం. ఈ దృశ్యం సామాజిక ఐక్యతకు, మతసామరస్యానికి చిహ్నంగా నిలుస్తోంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.
దాదాపు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ప్రస్తుతం టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఆలయ అభివృద్ధితో పాటు బ్రహ్మోత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తున్నారు. నారాపుర వెంకన్నను దర్శిస్తే శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది.































