ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగమే నడుస్తుంది. అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా..క్షణాల్లో మన కళ్ల ముందు కనిపిస్తోంది. ఇంటర్నెట్ సహాయంతో భూగోళంపై జరిగే ప్రతీ వింత, విశేషాలను ఆస్వాదిస్తున్నారు. అంతేకాకుండా మొబైల్ ఫోన్ల ద్వారానే ఇంట్లో ఉండే.. వివిధ రకాల షాపింగ్, ఫుడ్ డెలివరీ వంటి సేవలను కూడా అందులోనుంచి చేస్తున్నారు. అయితే ఒక్కోసారి మొబైల్ ఫోన్ ను పోగొట్టుకుంటాం.

అది ఎవరికైనా దొరికిందంటే.. తిరిగి ఇస్తారన్న నమ్మకం అస్సలు లేదు. అయితే అటువంటి సమయంలో మనం తక్షణమే చేయాల్సినివి ఏంటంటే.. మొదట మన సిమ్ ఏ టెలికంకు సంబంధించిని ఉందో చూసి.. ఆ ఆపరేటర్ కు కాల్ చేసి సిమ్ బ్లాక్ చేయాలి.
అప్పుడు బ్యాంకింగ్ కు సంబంధించి ఓటీపీలాంటివి రావడానికి అవకాశం ఉండదు. తర్వాత మరో సిమ్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మన బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి విషయం చెప్పి.. మొబైల్ లింక్ ను తీసేయాలి. కొత్త సిమ్ తీసుకున్న వెంటనే మళ్లీ బ్యాంక్ కు వెళ్లి ఆక్టివేట్ చేయించుకోవాలి. ఫోన్ పే, గూగుల్ పే ఇంకా వాలెట్ కు సంబంధించిన యాప్ లు మన మొబైల్ లో ఉంటే.. సదరు కస్టమర్ కేర్ నంబర్లకు ఫోన్ చేసి డియాక్టివేట్ చేయించుకోవాలి.
లేదంటే నగదు మాయం అవ్వడం ఖాయం. మీ సోషల్ మీడియా ఖాతాలను వేరే ఫోన్ లేదా, కంప్యూటర్ నుంచి ఓపెన్ చేసి పాస్వర్డ్ మార్చాలి. వాటికి లింక్ చేసి ఉన్న మొబైల్ నంబర్లను కూడా మార్చాలి. ఇలా పైన చెప్పిన విధంగా చేసి.. నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయాలి. వారు ఎఫ్ఐఆర్ కాపీని మన చేతికి ఇస్తారు. దీనిని మన బ్యాంక్ లో డబ్బులు డ్రా అయినట్లు అనిపిస్తే.. దీనిని ఆధారంగా వారికి చూపించొచ్చు.






























