అమరావతి: వైఎస్సార్సీపీ నేత, మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ అరెస్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. చట్ట నిబంధనలను ఉల్లంఘించి అరెస్టు చేశారని పేర్కొంటూ, కిషోర్ను తక్షణమే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో ఆయన గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు.

పోలీసులు తన భర్తను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ కిషోర్ భార్య తురకా సురేఖ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు, పోలీసులు, మెజిస్ట్రేట్ వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్ట్ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
హైకోర్టు కీలక వ్యాఖ్యలు
కోర్టు విచారణలో భాగంగా మెజిస్ట్రేట్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. “కిషోర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు కాబట్టి రిమాండ్ విధిస్తున్నట్లు” మెజిస్ట్రేట్ పేర్కొనడంపై హైకోర్టు “బెయిల్ పిటిషన్ దాఖలు చేయకపోతే రిమాండ్ విధించేస్తారా?” అని ఘాటుగా ప్రశ్నించింది. పోలీసులు కిషోర్ రిమాండ్ రిపోర్టును స్వీకరించడానికి నిరాకరించారని వాదించినప్పటికీ, మెజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో ఆ విషయం లేకపోవడంతో కోర్టు వాటిని తోసిపుచ్చింది.
“కరడుగట్టిన నేరస్తుడైనా అన్ని నేరాలను ఒప్పుకొని సంతకం చేస్తాడా?” అని ప్రశ్నిస్తూ, ఒక వ్యక్తి నిర్బంధం అక్రమమైనప్పుడు అతడిని ఒక్క క్షణం కూడా జైలులో ఉంచరాదని కోర్టు స్పష్టం చేసింది. పోలీసులు సమగ్ర వివరాలు సమర్పించడానికి గడువు కోరగా, “అంతవరకు జైలులో ఉంచమంటారా?” అని కోర్టు గట్టిగా ప్రశ్నించింది.
అన్ని వాదనలు విన్న అనంతరం, తురకా కిషోర్ అరెస్టు, రిమాండ్ విషయంలో ప్రాథమికంగా చట్ట నిబంధనలు పాటించలేదని హైకోర్టు నిర్ధారించింది. దీనితో ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు తురకా కిషోర్ గురువారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు.



































