ఇటీవల యువతలో కిడ్నీ సంబంధిత సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే ఎక్కువగా కనిపించిన కిడ్నీ రాళ్లు, మూత్రపిండాల సమస్యలు ఇప్పుడు 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారిలో కూడా సాధారణమవుతున్నాయి. జీవనశైలిలో వచ్చిన మార్పులు, తినే ఆహారం, తాగునీటి అలవాట్లు ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండటంతో శరీరంలో నీటి శాతం వేగంగా తగ్గిపోతోంది. చాలా మంది సరిపడా నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎసీ గదుల్లో ఎక్కువసేపు పనిచేసేవారికి దాహం తక్కువగా వేయడంతో నీరు తాగే పరిమాణం తగ్గిపోతుంది. దీని వల్ల మూత్రం గట్టిపడి, కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం కూడా కిడ్నీ ఆరో్యగంపై ప్రభావం చూపుతోంది. పిజ్జా, బర్గర్లు, ఫ్రైడ్ ఫుడ్స్, ప్యాకెట్ స్నాక్స్ వంటి వాటిలో అధికంగా ఉండే ఉప్పు, కొవ్వులు, ప్రిజర్వేటివ్స్ మూత్రపిండాల పనితీరుపై ఒత్తిడిని పెంచుతాయి. దీర్ఘకాలంలో ఇవి కిడ్నీ పనితీరును దెబ్బతీసే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
అలాగే రోజంతా కూర్చునే జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి కూడా కిడ్నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని చెబుతున్నారు. ప్రారంభ దశలో లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవడంతో చాలా మంది సమస్య తీవ్రంగా మారిన తర్వాతే వైద్యులను సంప్రదిస్తున్నారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ప్రతిరోజూ సరిపడా నీరు తాగడం, జంక్ ఫుడ్ తగ్గించడం, తాజా ఆహారం తీసుకోవడం, వ్యాయామాన్ని అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న వయసులోనే కిడ్నీ సమస్యలు రావడం పట్ల నిర్లక్ష్యం చేయకుండా, అవసరమైతే పరీక్షలు చేయించుకోవాలని హెచ్చరిస్తున్నారు.
































