గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు విమాన ప్రమాదంలో మరణించారనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఎవరూ బ్రతికిలేరని అధికారులు ప్రకటించడంతో ఆయన మరణం కన్ఫామ్ అయింది. ఢిల్లీ నుంచి లండన్కు అహ్మదాబాద్ మీదుగా వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఆయన జెడ్ క్లాస్ బిజినెస్ సీటులో ప్రయాణిస్తున్నారు. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ప్రమాదవశాత్తు ఓ మెడికల్ కాలేజీ డాక్టర్స్ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు మరణించారు.

విజయ్ రూపానీ గుజరాత్కు 16వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన 1956 ఆగస్టు 2న జన్మించారు. బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. 2016 నుంచి 2021 వరకు దాదాపు ఐదేళ్లపాటు ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్కోట్ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
బీజేపీలో ఒక సాధారణ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన విజయ్ రూపానీ, అంచెలంచెలుగా ఎదిగి 1996-97 మధ్య రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత పార్టీలో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. 2006 నుంచి 2016 వరకు గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో తొలిసారి గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికైన వెంటనే మంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత 2016లో రాజకీయ సమీకరణాలు మారడంతో నరేంద్ర మోదీ అండదండలతో ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. 2016 నుంచి 2021 వరకు సీఎంగా కొనసాగారు. మధ్యలో 2016లో కొంతకాలం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
విజయ్ రూపానీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు పుజిత్ గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. కొడుకు పేరు మీద పుజిత్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు విజయ్ రూపానీ కూడా విమాన ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబాన్ని ఏదో శాపం వెంటాడుతోందని బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
విజయ్ రూపానీ లండన్లో ఉంటున్న తన భార్య, కూతురిని చూసేందుకు వెళ్తున్నారు. గత ఆరు నెలలుగా ఆయన భార్య లండన్లోనే ఉంటున్నారు. ఆమెను ఇండియాకు తిరిగి తీసుకువచ్చేందుకు వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. ఈ దుర్ఘటన రూపానీ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.



































