టాలీవుడ్, కోలీవుడ్ను ఏకకాలంలో ఆకట్టుకుంటున్న సినిమా ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆర్థిక వ్యత్యాసాల మధ్య జరిగిన భావోద్వేగాల కథతో ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమాకు అద్భుతమైన కథను అందించింది మాత్రం పింగళి చైతన్య అనే రచయిత్రి.

అసలు పింగళి చైతన్య ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం గొప్ప చరిత్రతో మొదలవుతుంది. ఆమె పేరు పింగళి వెంకయ్య మనవరాలిగా చర్చలోకి వచ్చింది. స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ జెండాకు రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య వారసురాలిగా చైతన్యకు గొప్ప వారసత్వం ఉంది. ఆమె తండ్రి పింగళి దశరథ్ రామ్ మీడియా రంగంలో ఎన్కౌంటర్ వంటి బోల్డ్ రచనలతో ప్రజలను ప్రభావితం చేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో, భావోద్వేగాల కలబోతగా పింగళి చైతన్య సినీరంగంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
పింగళి చైతన్య తొలిసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాకి కో-రైటర్గా పని చేశారు. ఆ చిత్రం అద్భుతమైన విజయం సాధించడంతో ఆమెకు సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు లభించింది. ఆపై లవ్ స్టోరీ, మసూద, శరతులు వర్తిస్తాయి వంటి సినిమాలకు పాటలు రాసి గేయ రచయిత్రిగా కూడా ఎదిగారు. ఆమె ఫిదా సినిమాలో “ఊసుపోదు ఊరుకోదు”, “ఫిదా ఫిదా”, నెలటికెట్ సినిమాలో “బిజిలి, విన్నానులే”, లవ్ స్టోరీలో “ఏయ్ పిల్ల”, మసూద లోని “దాచి దాచి”, శరతులు వర్తిస్తాయిలో “ఆకాశం అందని”. వంటి పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక కుబేర కథ రాసింది, ఎడిటింగ్ చేసి రూపొందించింది శేఖర్ కమ్ముల సారథ్యంలోనే, కానీ కథా బీజాలు మాత్రం పింగళి చైతన్య కలంలోనివే.. అత్యంత ధనవంతుడికి.. దారిద్య్రంలో కూడా నిజాయితీగా ఉండే బిచ్చగాడి మధ్య నడిచే ఈ కథ, సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూ ముందుకు సాగుతుంది. ఆమె కథలోని లోతు, పాత్రల మధ్య పరస్పర భావోద్వేగాల బలమే ఈ సినిమా విజయానికి మూలమని పలువురు సినిమా విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సినిమా విజయంతో ఆమెకు సినీరంగంలో మరిన్ని అవకాశాలను తెస్తుందని ఆశిస్తున్నారు. కథల పట్ల ఉన్న ప్యాషన్, నవలా రచనల్లో ఉన్న పట్టు, పాటల రాతలోని భావావేశం అన్నింటి సమ్మిళితమే చైతన్య రైటింగ్. ‘కుబేర’ కథతో ఆమె ఒక్క అడుగులోనే ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇప్పుడు ఆమెపై దర్శకులు, నిర్మాతలు కన్నేశారు.
పింగళి చైతన్య ఇప్పుడు కథా ప్రపంచంలో మరొక కొత్త హోదాలో నిలిచారు. సినిమాలకు కొత్త బోధన, సరికొత్త శైలిలో కథ చెప్పే చైతన్య వంటివారు చాలా అరుదు. ఆమె రచనల ద్వారా మరోమారు తెలుగు చిత్రసీమ గొప్ప కథలకు నిలయం అని నిరూపితమవుతోంది. ‘కుబేర’తో కలం పట్టిన చైతన్య మరిన్ని అద్భుతమైన కథలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తారని ఆశిద్దాం.



























