దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్న వేళ.. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది చల్లటి పానీయాలు, ఐస్క్రీమ్స్, సోడాలు వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఇవి తాత్కాలికంగా మాత్రమే చల్లదనాన్ని ఇస్తాయని, నిజంగా శరీరాన్ని లోపల నుంచి కూల్గా ఉంచేది సహజ ఆహారాలేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నీటి శాతం ఎక్కువగా ఉండే కొన్ని ఆహారాలు వేసవిలో శరీరానికి సహజ రక్షణలా పనిచేస్తాయని సూచిస్తున్నారు.

ప్రముఖ పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేసవిలో శరీరానికి అత్యంత అవసరమైంది హైడ్రేషన్. శరీరంలో నీరు తగ్గిపోతే అలసట, తలనొప్పి, నీరసం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వేగంగా పెరుగుతాయి. అందుకే ఎక్కువ చక్కెర కలిగిన డ్రింక్స్కి బదులుగా సహజమైన ఆహారాలను తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
వేసవిలో కీరదోసకాయను డైట్లో చేర్చుకోవడం చాలా ఉపయోగకరం. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీరం తేమగా ఉంటుంది. అంతేకాదు ఫైబర్ కూడా ఉండటం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. మధ్యాహ్నం సమయంలో కీర ముక్కలు లేదా సలాడ్ రూపంలో తీసుకుంటే శరీరానికి చల్లదనం లభిస్తుంది.
కొబ్బరి నీళ్లు కూడా సమ్మర్లో బెస్ట్ నేచురల్ డ్రింక్గా చెప్పొచ్చు. ఇందులో ఉండే పొటాషియం, మినరల్స్ శరీరంలో కోల్పోయిన లవణాలను భర్తీ చేస్తాయి. ఎండలో ఎక్కువసేపు తిరిగేవారికి ఇది మంచి ఎనర్జీ డ్రింక్లా పనిచేస్తుంది. చక్కెర కలిపిన కూల్డ్రింక్స్ కంటే కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.
పుచ్చకాయ కూడా వేసవిలో ఎక్కువగా తినాల్సిన పండ్లలో ఒకటి. ఇందులో నీటి శాతం అధికంగా ఉండటంతో పాటు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా చర్మాన్ని కూడా తాజాగా ఉంచుతుంది. వేసవిలో వచ్చే అలసటను తగ్గించడంలో పుచ్చకాయ మంచి సహజ ఆహారంగా పనిచేస్తుంది.
పెరుగు, మజ్జిగ వంటి ఆహారాలు కూడా వేసవిలో శరీరానికి ఉపశమనం ఇస్తాయి. ముఖ్యంగా మజ్జిగ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు శరీర వేడి తగ్గుతుంది. పుదీనా, కరివేపాకు కలిపిన మజ్జిగ మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక పుదీనా ఆకులకు సహజంగా చల్లదనం ఇచ్చే గుణం ఉంటుంది. జ్యూస్లు, మజ్జిగ లేదా సలాడ్స్లో పుదీనా వాడటం వల్ల శరీరం తాజాగా అనిపిస్తుంది. అదే సమయంలో జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది.
వేసవిలో చాలా చల్లటి ఐస్ వాటర్ తాగడం కంటే మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మట్టి పాత్రల్లోని నీరు సహజంగా చల్లబడటంతో పాటు శరీరానికి అనుకూలంగా ఉంటుంది. ఇది గొంతు సమస్యలు, జీర్ణ సమస్యలు రాకుండా సహాయపడుతుందని చెబుతున్నారు.
అయితే ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి వేర్వేరుగా ఉంటుంది. కిడ్నీ, షుగర్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డైట్లో మార్పులు చేసేముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.































