నయనతారలా చేయాలని ఉంది.. నేనంత స్టార్ హీరోయిన్ ను కాదు: హీరోయిన్ పూర్ణ

ప్రస్తుతం బుల్లితెరపై ప్రముఖ డ్యాన్స్ రియాల్టీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహిస్తున్న మళయాళీ భామ పూర్ణ గురించి అందరికీ తెలిసిందే. సీమ టపాకాయ్ సినిమాతో మొదటి సారిగా అల్లరి నరేశ్ సరసన నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది పూర్ణ. ఆ తర్వాత డైరెక్టర్ రవిబాబు తెరకెక్కించిన అవును, లడ్డుబాబు, అవును 2 సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

తర్వాత కమెడియన్ శ్రీనివాస్ సరసన ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో కూడా నటించారు. ఆ తర్వాత పూర్ణకి తెలుగులో ఎక్కువగా ఆఫర్లు రాలేదు. దీంతో కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పటి వరకు తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో కలిపి మొత్తం 40 సినిమాల్లో నటించింది పూర్ణ. అటు సినిమాల్లో.. ఇటు బుల్లితెరపై నటిస్తూ ఎంతో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆమె డైరెక్టర్ కళ్యాణ్ జీ గోగన తెరకెక్కించిన సుందరి సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది. దీనిలో హీరోగా బుల్లితెర నటుడు అర్జున్ అంబటి నటించారు.

ఆగస్టు 13న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘సుందరి’ చిత్రంలో తాను చేసింది స్టార్‌ హీరోయిన్స్‌ స్థాయివారు చేసే పాత్ర.. నేనింకా ఆ స్థాయికి రాలేదు. కానీ తన మీద నమ్మకంతో దర్శక నిర్మాతలు ఈ సినిమా తీసినందుకు ధన్యవాదాలు అంటూ ఆమె హైదరాబాద్ లోని విలేకరుల సమావేశంలో చెప్పారు. అంతే కుండా తనకు నయనతార స్పూర్తి అంటూ చెప్పారు. ఆమెలా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించాలని ఉంది అంటూ ఆమె అన్నారు.

చిత్ర నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ.. థియేటర్లోనే సినిమా విడుదల చేయాలని ఇన్ని రోజులు ఆగామని ఆయన చెప్పారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలవుతుందన్నారు. ఎదురుగా ఓ మనిషి ఉంటే సరిగ్గా మాట్లాడటానికి భయపడే ఓ అమ్మాయి అతిగా స్పందిస్తే ఎలా ఉంటుంది? అన్నదే ఈ సినిమా కథ అని డైరెక్టర్ చెప్పారు.