రవాణా శాఖ కార్యాలయం చుట్టూనో.. దళారుల చుట్టూనో తిరిగితేగానీ కనీసం లెర్నింగ్ లైసెన్స్(ఎల్ఎల్ఆర్) కూడా అందుకోలేని పరిస్థితులున్నాయ్.. దరఖాస్తు ఇవ్వడం, అర్హత పరీక్ష రాయడం, ఉత్తీర్ణత సాధించడం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది.ఈ పరిస్థితుల్లో మార్పులు తెచ్చి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొనేందుకు రవాణా శాఖ సన్నద్ధమైంది. కార్యాలయానికి వచ్చే అవసరం లేకుండానే లెర్నింగ్ లైసెన్స్ పొందేలా చర్యలు మొదలయ్యాయి.ఆన్లైన్లోనే పరీక్షలు నిర్వహించి ఎల్ఎల్ఆర్ జారీ చేయనున్నారు.ఈ మేరకు ఎంపిక చేసిన ప్రాంతాలు,కేంద్రాల్లో ఇందుకోసం ప్రత్యేకంగా కియోస్కులు ఏర్పాటుచేస్తారు.వీటిల్లో దరఖాస్తుదారు ఆధార్ సంఖ్య,ఇతర వివరాలు నమోదు చేయాలి. ఆపై పరీక్ష రుసుము ఆన్లైన్లో చెల్లించాలి.తరవాత ఎల్ఎల్ఆర్కు సంబంధించిన ప్రశ్నావళి వస్తుంది.నిర్దేశిత సమయంలో దానిని పూర్తిచేయాలి.అందులో ఉత్తీర్ణత సాధిస్తే ఎల్ఎల్ఆర్ జారీ అవుతుంది.దీన్ని ప్రింట్ తీసుకొంటే సరిపోతుంది.అలాగే దరఖాస్తుదారు ఈ-మెయిల్కీ ఇందుకు సంబంధించిన పత్రం వెళ్తుంది.
పరీక్ష సమయంలో దరఖాస్తుదారుడే రాసేలా, కెమెరా నిఘా ఉండేలా కియోస్కులు ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. విదేశాలకు ఉన్నతవిద్య కోసం వెళ్లే విద్యార్థులు జీఆర్ఈ,టోఫెల్ లాంటి పరీక్షల్ని ఆన్లైన్ ద్వారా రాస్తున్నారు.ఇదే తరహాలో ఎల్ఎల్ఆర్ కియోస్కులు ఉంటాయి.అలాగే ఎంపికచేసిన ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ వీటి ఏర్పాటుకు పరిశీలన చేశారు.ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని కొన్ని కళాశాలలతో చర్చలు జరిపారు.
ఎల్ఎల్ఆర్ గడువు పూర్తయ్యాక పూర్తిస్థాయి లైసెన్స్ జారీలోనూ పలు మార్పులు తేనున్నారు.డ్రైవింగ్ ట్రాక్లను ఆధునికీకరించనున్నారు.అలాగే ట్రాక్ మీదకు వాహనాన్ని తీసుకువెళ్లే ముందే సిమ్యులేటర్పై వాహన చోదకుడి పరిజ్ఞానాన్ని పరీక్షించనున్నారు. సిమ్యులేటర్పై కూర్చొని ఎదురుగా ఉన్న తెరపై ఉండే రహదారి/ట్రాక్ చూస్తూ డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది.రహదారి నిబంధనలు పాటిస్తూ వాహనం నడపగలుగుతున్నాడో లేదో పరిశీలిస్తారు.తరవాత ట్రాక్పైకి తీసుకువెళ్లాలన్నది అధికారుల యోచన.ఇందుకు సంబంధించి కేంద్రప్రభుత్వం నుంచి అనుమతులు పొందాల్సి ఉందని సమాచారం.ఇప్పటికే ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు.