లాక్ డౌన్ నేపథ్యంలో మాంసం డిమాండ్ బాగా పెరిగింది. ప్రజలు చికెన్, మటన్ తినడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. ఇదే అదనుగా మాంసం వ్యాపారులు అధిక ధరలతో ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. భారీగా ధరలు పెంచి అమ్ముతున్నారు. అంతేకాదు కొన్ని చోట్ల కల్తీ చేసి మరీ మాంసం అమ్ముతున్నట్టు ప్రభుత్వానికి పిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో మాంసం ధరలను నియంత్రించేందుకు ఒక ప్రత్యెక కమిటీని ఏర్పాటు చేసారు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ కమిటీ సభ్యులు నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి సుమారు 11 దుకాణాలలో సోదాలు జరిపారు. ఇదే క్రమంలో లైసెన్స్ లేని దుకాణాలపై కొరడా ఝళిపించారు. మాంసం ధరలను కేసుల నిర్ణయించారు.

సికింద్రాబాద్ లోని పలు దుకాణాలలో కల్తీ మాంసం అమ్ముతున్నారని ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక బృందాలతో తనిఖి చేసి, కల్తీ మాంసం అమ్ముతున్న పలు దుకాణాలను సీజ్ చేసారు. ఈ నేపథ్యంలో మటన్ ధరను కిలో 700 రూపాయిలుగా నిర్ణయించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఈ ధర ప్రతి దుకాణం ముందు అందరికి కనిపించేలా బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిచి ఎక్కువ ధరకు మటన్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
































