వచ్చే ఏడాది ఫిబ్రవరి లోపు మీ మొబైల్ నంబర్లను ఆధార్తో లింక్ చేసుకోండి. లేదంటే మీ మొబైల్ నంబర్ పనిచేయదు… ఇదీ.. ఇప్పుడు చాలా మంది మొబైల్ వినియోగదారులకు రోజూ వస్తున్న మెసేజ్. ఈ క్రమంలో పలువురు టెలికాం ఆపరేటర్లు ఈ విషయం పేరిట వినియోగదారులను రోజూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మెసేజ్ల వరకు అయితే ఓకే, కానీ మొబైల్ నంబర్ను ఆధార్కు లింక్ చేయండి.. అంటూ కాల్స్ కూడా చేసి వేధిస్తున్నారు. సరే.. వారు మారరు. కానీ నిజంగా.. ఇలా లింక్ చేస్తే ప్రయోజనం ఏంటి..? అనే మాట పక్కన పెడితే.. ఇప్పుడు మేం చెప్పబోయే సంఘటన గురించి వింటే మాత్రం మీ మొబైల్ నంబర్ను ఆధార్కు లింక్ చేయడానికి ఒక నిమిషం ఆలోచిస్తారు. అవును, మీరు విన్నది కరెక్టే. ఎందుకంటే విషయం అలాంటిది మరి..! ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
అతని పేరు శాశ్వత్. అతనికి ఓ రోజున మెసేజ్ వచ్చింది. అందులో ఏముందంటే… మీ మొబైల్ నంబర్ బ్లాక్ అయింది. దాన్ని కంటిన్యూ చేయాలంటే ఆధార్కు లింక్ చేసుకోవాలి. కనుక మీ సిమ్ ఫోన్ నంబర్, సీరియల్ నంబర్లను 121 నంబర్కు ఎస్ఎంఎస్ చేయండి.. అంటూ అచ్చం ఎయిర్టెల్ కస్టమర్ కేర్ నుంచి వచ్చినట్టుగానే మెసేజ్ వచ్చింది. దీంతో శాశ్వత్ ఇది నిజమే అని నమ్మి సదరు నంబర్లను మెసేజ్ చేశాడు. అంతే.. క్షణాల్లో అవతలి వారు శాశ్వత్ సిమ్ను క్లోనింగ్ చేశారు. అంటే… అతని సిమ్కు డూప్లికేట్ సిమ్ను తయారు చేశారన్నమాట. అనంతరం ఆ సిమ్తో అతని ఐసీఐసీఐ శాలరీ అకౌంట్లో ఉన్న రూ.1.30 లక్షలను దోచేశారు. ఆశ్చర్యం… ఇది ఎలా జరిగింది.. అనుకుంటున్నారు కదా… అయితే వివరిస్తాం చూడండి..!
ఈ మధ్య కాలంలో డిజిటల్ పేమెంట్ మెథడ్స్ ఎక్కువయ్యాయి తెలుసు కదా. అనేక రకాల వాలెట్లు యాప్ ల రూపంలో మనకు అందుబాటులో వచ్చాయి. అయితే వాటిల్లో ఐఎంపీఎస్, నెఫ్ట్ వంటి పేమెంట్స్ మెథడ్స్తోపాటు యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) అనే కొత్త పేమెంట్ విధానం కూడా మనకు అందుబాటులో ఉంది. దీనికి కేవలం మొబైల్ నంబర్ ఉంటే చాలు. మన బ్యాంక్ వివరాలు ఏమీ ఎంటర్ చేయాల్సిన పని ఉండదు. మొబైల్ నంబర్ను యూపీఐకి అనుసంధానిస్తే యూపీఐ ఇంటర్ఫేస్ మన మొబైల్ నంబర్కు కనెక్ట్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లను వెదుకుతుంది. ఏదో ఒకటి లింక్ అయి ఉంటుంది కనుక కచ్చితంగా అలా లింక్ అయిన బ్యాంక్ను చూపిస్తుంది. దీంతో బ్యాంక్ ఖాతా యూపీఐకి అనుసంధానం అవుతుంది. అలా అయ్యాక ఇక అంతే. బ్యాంక్ వివరాలతో సంబంధం లేకుండా నేరుగా యూపీఐ ద్వారా డబ్బును పంపుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. ఇదే నేరగాళ్లకు అవకాశంగా మారింది. ఈ క్రమంలోనే పైన చెప్పిన శాశ్వత్ నంబర్ కూడా నేరగాళ్ల చేతిలో పడింది. వారు కూడా యూపీఐ ద్వారానే అతని ఖాతాలో ఉన్న రూ.1.30 లక్షలను కాజేశారు.
అయితే శాశ్వత్ నిజం తెలుసుకునేసరికి ఆలస్యం అయింది. అయినప్పటికీ లేట్ చేయకుండా వెంటనే కస్టమర్ కేర్కు కాల్ చేసి విషయం చెప్పాడు. అనంతరం ఆ బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లాడు. అక్కడ కూడా కంప్లెయింట్ ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు ఫలితం లేదు. పైగా శాశ్వత్ కంప్లెయింట్ ఇచ్చాక 18 గంటల తరువాత కూడా అతని బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మాయమయ్యాయి. అతను ఫిక్స్ చేసుకున్న ఫిక్స్ డిపాజిట్లను కూడా నేరగాళ్లు కాజేశారు. కంప్లెయింట్ ఇచ్చాక కూడా ఇలా జరిగిందంటే ఇక ఆ బ్యాంక్ ఖాతాదారులకు ఎలాంటి సెక్యూరిటీ కల్పిస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అసలు కంప్లెయింట్ ఇవ్వగానే ఆ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవ్వాలి. కానీ అలా కాలేదు. అంటే అందుకు బ్యాంకే బాధ్యత వహించాలి.
చూశారుగా… మీకు కూడా ఇలాంటి మెసేజ్లు వస్తే స్పందించకండి. మీ మొబైల్ నంబర్ను ఆధార్కు అనుసంధానం చేసుకోవాలంటే కచ్చితంగా స్టోర్కు వెళ్లాల్సిందే. అంతేకానీ అలా అనుసంధానం చేసుకునేందుకు సదరు కంపెనీలు ఆన్లైన్లో, మొబైల్ ద్వారా ఎలాంటి సదుపాయం కల్పించలేదు. ఇక మరో విషయం ఏమిటంటే… మీ సిమ్ కార్డు పోయినా వెంటనే దాన్ని బ్లాక్ చేయండి. ఎందుకంటే పైన చెప్పాం కదా. కేవలం మీ మొబైల్ నంబర్ ఉంటే చాలు, దాంతో బ్యాంకులో ఉన్న డబ్బులు కాజేస్తారు. కాబట్టి ఈ విషయంలోనూ జాగ్రత్త వహించాల్సిందే..!