భారత ప్రభుత్వం ఒకే దేశం ఒకే పన్ను అనే పేరిట చారిత్రాత్మకంగా ప్రతిష్టాత్మకంగా జీఎస్టీ ని అమలు చేస్తోంది. ఈ చట్టం అమలులో కి వచ్చినప్పటి నుండి అందులో ఎన్నో వాటికి మినహాయింపులు పన్ను శాతాన్ని తగ్గిస్తూ పెంచుతూ ఎన్నో మార్పులు చేస్తూ వచ్చింది.. అయితే పరోక్షంగా భారీ లాభాలను తెచ్చిపెడుతున్న పెట్రోలియం డీజిల్ వంటి వాటిని ఈ చట్టం పరిధిలోకి తీసుకు రాలేదు. ఇక ఈ నేపధ్యం లో పెట్రోల్, డీజీల్లను కూడ జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్రప్రధాన్ ఇటీవల కాలంలో డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయమై జిఎస్టి కౌన్సిల్ను కోరనున్నట్టు ఆయన ప్రకటించారు. పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్టి పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్రాలు భారీగా ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్రాలు ఒప్పుకొనే అవకాశం లేకపోవచ్చనే వాదనలు కూడ విన్పిస్తున్నాయి. ఈ చమురు ధరలను తగ్గాలంటే జిఎస్టి పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ధర్మేంధ్రప్రధాన్ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. పెట్రోలియం ఉత్పత్తును జిఎస్టి పరిధిలోకి తెచ్చే విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
కొందరు దీనికి అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ఆర్థికశాఖకు ఇంధనశాఖ కోరింది. వివిధ రాష్ట్రాల్లో పెట్రోలియం ఉత్పత్తులపై పలు రకాల పన్నులు ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గినా కానీ, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మాత్రం తగ్గలేదు. దీంతో జిఎస్టి పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది.
ఈ అంశాన్ని పరిశీలించాలని ఇంధనశాఖ కోరింది. అయితే ఆర్థికశాఖ ఈ విషయమై ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. జిఎస్టి కౌన్సిల్ తీర్మానం చేస్తే మాత్రం పెట్రోలియం ఉత్పత్తులు జిఎస్టి పరిధిలోకి చేర్చక తప్పని అనివార్య పరిస్థితులు నెలకొంటాయి. ఒకవైపు పెట్రోల్, డీజీల్పై లీటర్కు పలు రకాల పన్నులను వినియోగదారుడు చెల్లిస్తున్నాడు. మరోవైపు ఎక్సైజ్ పన్నును కేంద్ర ప్రభుత్వం విధిస్తోంది. వ్యాట్ను రాష్ట్రాలు విధిస్తున్నాయి.
ఆయా రాష్ట్రాలు డీలర్ కమీషన్తో కలిపి వ్యాట్ ఛార్జీలను వినియోగదారులపై మోపుతున్నాయి. నిజానికి లీటర్ పెట్రోల్ ధర రూ.30.70, అయితే కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ రూ.21.48, రాష్ట్రాలు విధించే పన్ను రూ.27, ఇందులో వ్యాట్ రూ.14.96, డీలర్ కమీషన్ రూ.3.24 ఉంటుంది. ఈ పన్నులన్ని కలిపి లీటర్ పెట్రోల్ ధర రూ.70.38కు చేరింది. అయితే ప్రతిరోజూ పెట్రోల్, డీజీల్ ధరల్లో మార్పులు ఉంటున్నాయి.