ఈ మధ్య కాలంలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తరచూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా రఘురామ ఏపీ మహిళలు సీరియల్స్ చూడటం తగ్గించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా ఈయన “రచ్చబండ” అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ఏపీ మహిళలు రాష్ట్ర రాజధాని అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించాలని.. అలా జరగాలంటే సీరియల్స్ చూడటం తగ్గించాలని అన్నారు.

రఘురామ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రఘురామ చేసిన వ్యాఖ్యల గురించి మహిళలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రఘురామ వైసీపీకి కొరకరాని కొయ్యలా తయారయ్యారు. ప్రతిపక్ష నేతలతో పోలిస్తే రఘురామ కృష్ణంరాజే వైసీపీని ఎక్కువగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉండటం గమనార్హం. వైసీపీ నేతలు రఘురామపై విమర్శలు చేస్తే మరో తలనొప్పి అని సైలెంట్ గా ఉంటున్నారు.
రఘురామ ఏపీ రాజధాని అమరావతి గురించి కూడా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని అని.. అమరావతికి రిఫరెండంగా భావిస్తే ఎన్నికలకు సిద్ధమని తాను ప్రకటించినా వైసీపీ నేతలు మాత్రం తన సవాల్ కు అస్సలు స్పందించడం లేదని అన్నారు. అమరావతి ఉద్యమం మొదలై మూడు వందల రోజులైన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రెట్టించిన ఉత్సాహంతో ఆందోళన చేపట్టాలని రఘురామ అన్నారు.
అమరావతిని రైతుల సమస్యగా ఎవరూ భావించవద్దని ఈ సమస్యను ప్రజల సమస్యగా భావించాలని.. ప్రజలంతా ఈ సమస్యను ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. మహిళలు ముందుంటే దేనికైనా శుభం కలుగుతుందని.. మహిళామణుల యుద్ధస్పూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని.. రాష్ట్ర రాజధానిగా అమరావతిని సాధించే వరకు 50 శాతం సీరియల్ టైమ్ ను తగ్గించాలని చెప్పారు.




























