గాన గంధర్వులు, పద్మభూషణ్ డాక్టర్ శ్రీ పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం త్వరితగతిన మెరుగు పరిచే ప్రయత్నంలో తమిళనాడు ప్రభుత్వం చురుగ్గా వున్నట్లుగా, తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని MGM హెల్త్ కేర్ వైద్యశాలలో బాలుగారికి చికిత్స చేయిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఆదివారం బాలు గారి కోసం MGM హెల్త్ కేర్ హాస్పిటల్ లో ప్రత్యేకంగా ఒక ఐసోలేషన్ రూమును రూపొందించినట్లు, ఆదివారం చెన్నైలో సంపూర్ణ లాక్ డౌన్ అయినా ముఖ్యమంత్రి చొరవతో ఐసోలేషన్ రూమును కావలసిన సామాగ్రి అంతా బయట నుండి వాహనాల్లో రప్పించ్చారని, అలాగే MGM లో కరోనా చికిత్స కోసం బాలు గారు చేరారన్న వార్త చెవిలో పడ్డప్పటి నుండి భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు యాజమాన్యంతో మాట్లాడుతూ బాలు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొంటున్నారని తెలిసింది. గతంలో చెన్నైలోని MGM హెల్త్ కేర్ ను వెంకయ్యనాయుడు చేతుల మీదుగానే ప్రారంభించబడడం విశేషం.

వెంకయ్యనాయుడు సూచనల మేరకు ప్రత్యేక ఐసోలేషన్ ను – హాస్పిటల్ లో యాజమాన్యం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిసింది. ఔ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి కార్యాలయం ఎప్పటికప్పుడు బాలు గారి ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్స్ తెప్పించుకొని పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి. ఈ సందర్భంగా మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కూడా బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది . కన్నడ గాయకుడిగా బాలు గారు ఎంత ఖ్యాతి గడించాడన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

ఇదిలావుండగా.. కేంద్ర ప్రభుత్వం , పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు గాన గంధర్వులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు సేకరిస్తుంటే.. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ , ఆంద్రప్రదేశ్ లకు చెందిన తెలుగు ముఖ్యమంత్రులు K.చంద్రశేఖర రావు గాని, Y.s జగన్ గాని నేటికి కూడా బాలు గారి ఆరోగ్యం గురించిన వివరాలను ఫోన్లో వాకబు చేయకపోవడం దురదృష్టకరమని చెప్పవచ్చు. బాలుగారికి కరోనా పాజిటివ్ సోకిన క్రమంలో “మా నాన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, మి అమ్మ సావిత్రి గారి ఆరోగ్యాలు మెరుగవుతున్నాయి” అని ఆయన కుమారుడు చరణ్ బాబు ప్రకటించినప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీతప్రియులు, బాలు గారి అభిమానుల వదనాల్లో ఆనందం వ్యక్తమౌతుంది.



























