ప్రస్తుతం కరోనా రెండవ దశ భారతదేశాన్ని చిగురుటాకులా వణికిపోతోంది. ప్రజలందరూ ఈ మహమ్మారి పట్ల ఎంతో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఈ వైరస్ తీవ్రరూపం దాల్చడంతో రోజురోజుకు అధికంగా కేసులు నమోదు అవడమే కాకుండా మరణాల సంఖ్య కూడా ఎక్కువగా నమోదవుతుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది సరైన సమయంలో ఆక్సిజన్ లభించగా మృత్యువాత పడుతున్నారు.

తాజాగా ఉస్మానియా విద్యార్థి సంఘం నేత బెల్లంకొండ కృష్ణగౌడ్ కరోనా బారినపడి సోమవారం మృత్యువాత పడిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆసుపత్రిలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను తన భార్యకు ఫోన్ చేసి చెప్పిన చివరి మాటలు వింటే కన్నీళ్లు ఆగవు. ఇతని మాటలు వింటే వైరస్ ఏ విధంగా ప్రజలను బలి తీసుకుంటుందో అర్థమవుతుంది.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన కృష్ణగౌడ్ ఓయూలో విద్యార్థి ఐకాస నేతగా ఉన్నారు. కొవిడ్ బారినపడిన ఆయన పది రోజుల క్రితం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఆదివారం రాత్రి తన భార్యకు ఫోన్ చేసి తనని ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదని, తనకు శ్వాస తీసుకోవడం ఎంతో ఇబ్బందిగా ఉంది కనీసం ఆక్సిజన్ కూడా పెట్టలేదని వెంటనే నన్ను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి బతికించమని తన భార్యను వేడుకున్నాడు.
కృష్ణ గౌడ్ పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం నిమ్స్ లో కన్నుమూశారు. డాక్టర్లు మాత్రం అతనిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించామని, అతని పరిస్థితి విషమం కావటం వల్లే ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.































